YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 19 June 2012

రైతుల పక్షాన పోరాడండి

పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు
ఖరీఫ్ మొదలైనా విత్తనాలు, ఎరువుల్లేవు
విత్తనాల కోసం రోడ్ల మీద క్యూ కట్టాల్సిన దుస్థితి 
పత్తి విత్తనాలు బ్లాక్‌లో అమ్ముతున్నా పట్టించుకోని సర్కారు
రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకులు
సర్కారుపై అన్ని మండల కేంద్రాల్లో పోరాడండి

హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్నం పెట్టే రైతులను అన్ని రకాల వేధిస్తూ వారిని వీధుల పాలు చేస్తున్నందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ శ్రేణులు పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు వారాలు గడిచినా పొల్లాల్లో దుక్కి దున్నాల్సిన రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం రోడ్ల మీద క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. 

‘‘విత్తనాలు దొరక్క గత్యంతరం లేక రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.930 విలువ చేసే పత్తి విత్తనాలను ఓ కంపెనీ తమ సొంత డీలర్ల ద్వారానే రూ.1,500కు అమ్మిస్తోంది. అయినా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందే తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పత్తి విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ తీరు ఇలా ఉంటే, ఆముదం విత్తనాలను కూడా బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఆముదం విత్తనాలు బ్లాక్‌లో అమ్మడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. 

సోయాబీన్ విత్తనాలు క్వింటాలుకు రూ.1,540 పెంచి రూ.2,680 చేశారు. వేరుశనగ విత్తనాల ధర కూడా పెంచినా నాణ్యమైన విత్తనాలు సరఫరా కావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తై... రూ.వేల కోట్లతో రుణ ప్రణాళికను ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించినా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. తల తాకట్టు పెట్టి పది రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చినా బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు దొరకడం లేదు’’ అని ప్రకటనలో పేర్కొంది. 

పస్తుత పరిస్థితుల్లో మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాదిరి రైతులకు భరోసా ఇచ్చే నాయకుడే ప్రస్తుతం కరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారయిందనీ... రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది కౌలుదారులకు గాను 5.76 లక్షల మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు జారీ చేశారని వెల్లడించింది. మిగతా కౌలు రైతులు కార్డుల కోసం, రుణాల కోసం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని విమర్శించింది. 876 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటే పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలిసి పోతోందని పార్టీ ధ్వజమెత్తింది. అందుకే పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో రైతుల సమస్యలపై పోరాడాలని పార్టీ పిలుపునిచ్చింది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!