YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 9 July 2012

బెయిల్ తిరస్కరణ అసమంజసం

‘సుప్రీం’లో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ 
బెయిల్ తిరస్కరణకు హైకోర్టు చూపిన కారణాలు అసమంజసం 
రాజకీయ హోదా కారణంగా బెయిల్ నిరాకరించటం ఏకపక్షం 
రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద హక్కులను హరించటమే
దర్యాప్తుకు ముందు ఎంపీగానే ఉన్నాను.. తర్వాతా ఉంటాను 
అరెస్టుకు ముందు సాక్షులను ప్రభావితం చేసినట్లు సీబీఐ 
ఆరోపించ లేదు .. ఇప్పుడు ప్రభావితం చేయవచ్చన్నది అపోహే
అందుకు సంబంధించి సీబీఐ ఎలాంటి ఆధారాలూ చూపించలేదు 
బెయిల్ మంజూరు చేయటం వల్ల దర్యాప్తుకు వచ్చే ఇబ్బంది లేదు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తనకు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆయన సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సంబంధం లేని కారణాలను చూపుతూ కొట్టివేసిందని అప్పీలులో పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ హోదా కారణంగా చూపుతూ బెయిల్ నిరాకరించటం ఏకపక్షమని అభివర్ణించారు. ప్రత్యేకించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో తాను విభేదించిన పరిస్థితుల్లో ఈ వాదన నిలువజాలదని పేర్కొన్నారు. అదీగాక.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ తన వ్యవహారశైలికి సంబంధించి సీబీఐ వ్యక్తంచేసిన సందేహాలకు కింది కోర్టుల్లో ఎలాంటి ఆధారాలూ చూపలేదని నివేదించారు. ‘‘పిటిషనర్‌కు పెద్ద మొత్తంలో ఉన్న ఆస్తులు, ప్రజా జీవితంలో గల హోదాను పరిగణనలోకి తీసుకుని.. ఈ కేసులో పలు అంశాల్లో ఇంకా కొనసాగుతున్న దర్యాప్తులో పిటిషనర్ జోక్యం చేసుకునే, సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాన్ని కొట్టివేయలేం. ... ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో దుర్వినియోగమై నష్టపోయినట్లు చెప్తున్న సమాజ విస్తృత ప్రయోజనాలకన్నా.. పిటిషనర్ వ్యక్తిగత హక్కుకు ప్రాధాన్యం ఉండదని ఈ కోర్టు భావిస్తోంది’’ అని హైకోర్టు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను జగన్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇది బెయిల్‌కు సంబంధించిన న్యాయసూత్రాలను పూర్తిగా తప్పుగా అన్వయించటమేనని, రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద తనకు గల హక్కులను హరించటాన్ని కొనసాగించటమేనని పేర్కొన్నారు.

‘‘కేవలం స్థితిమంతులు కావటం, లేదా ప్రజా జీవితంలో ఉండటమనేది.. ఒక నిందితుడు బెయిల్ పొందటానికి అనర్హుడ్ని చేయజాలరనేది సాధారణ విషయం. ‘జైలు కాదు.. బెయిలు’ అన్నది సాధారణంగా అనుసరించే విధానమనేది వాస్తవం కాగా.. ఇంకా నిరూపణ కాని ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్న ఆరోపణల వంటి సంబంధం లేని అంశాలపై ఆధారపడింది’’ అని వివరించారు. తాను పార్లమెంటు సభ్యుడిని కాబట్టి.. సాక్షులను బెదిరించడం, సాక్ష్యాలను తారుమారు చేయగల అవకాశం ఉందంటూ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించటం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి హోదాను ఆ వ్యక్తికి అనుకూలంగానే పరిగణనలోకి తీసుకోవాలి కానీ.. ఆ హోదాకు తగ్గవిధంగా నడుచుకోకపోతే తప్ప ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉపయోగించరాదని నివేదించారు. తాను సీబీఐ అరెస్ట్ చేయటానికి ముందు కూడా ఎంపీగానే ఉన్నానని, ఇకపై కూడా ఎంపీగానే ఉంటానని జగన్ తెలిపారు. తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి గత ఏడాది ఆగస్టులో హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ దర్యాప్తు చేపట్టిందని, ఇప్పటి వరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని జగన్ తన పిటిషన్‌లో తెలిపారు. మూడు చార్జిషీట్లలో దాదాపు 150 మందిని సాక్షులుగా పేర్కొన్నారని, వీరిలో ఒక్కరిని బెదిరించినట్లు కూడా సీబీఐ చిన్న ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన 9 నెలల కాలంలో కూడా దర్యాప్తును అడ్డుకోవటం కానీ, ఎవరైనా సాక్షిని బెదిరించిన ఘటనలు కానీ లేవని.. సీబీఐ కూడా తన అరెస్టుకు ముందు అటువంటి ఆరోపణలు కూడా చేయలేదని వివరించారు. జగన్ పిటిషన్‌లోని ముఖ్యాంశాలు ఇవీ... 

నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ఇటీవల జరిగిన 18 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాను. నా ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో.. సీబీఐ విచారణ పేరుతో నాకు నోటీసులు జారీచేసింది. 

మే 22న సీబీఐ అధికారులు హఠాత్తుగా సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఎ(1) కింద నోటీసు జారీ చేశారు. మే 25న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. సీబీఐ నోటీసును గౌరవిస్తూ 25, 26, 27 తేదీల్లో సీబీఐ ఎదుట హాజరయ్యాను. దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాను. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. అయినా కూడా మే 27న సీబీఐ అధికారులు నన్ను అరెస్ట్ చేశారు. 

అరెస్ట్ సమయంలో జారీ చేసిన మెమోలో నేను పార్లమెంట్ సభ్యుడిని కాబట్టి, ఆ హోదా వల్ల దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది సీబీఐ దర్యాప్తు ప్రారంభమైన నాటి నుంచి మే 26వ తేదీ వరకు నేను బయటే ఉన్నాను. దర్యాప్తులో భాగంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేశారు. బయట ఉన్నంత కాలం నేను దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు ఎన్నడూ ఆరోపించలేదు. దర్యాప్తులో జోక్యం చేసుకున్నట్లు, సాక్షులను ప్రభావితం చేసినట్లు నిరూపించనూ లేదు. 

మే 27న అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు నన్ను అదే నెల 28న సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే సమయంలో తమ కస్టడీ కోరుతూ సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు నన్ను సీబీఐ కస్టడీకి ఇవ్వకుండా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. దీనిని సవాలు చేస్తూ నేను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ఇదే సమయంలో సీబీఐ కూడా నన్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు సీబీఐ పిటిషన్‌ను అనుమతించి నన్ను ఐదు రోజుల కస్టడీకి ఇచ్చింది. తరువాత కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది. 

సీబీఐ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో నాకు బెయిల్ ఇవ్వాలంటూ 29న నేను అదే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాను. అయితే ఈ పిటిషన్‌ను కింది కోర్టు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే తోసిపుచ్చింది. దీంతో నేను జ్యుడీషియల్ రిమాండ్‌లోనే కొనసాగాల్సి వస్తోంది. 

నా హోదా వల్ల సాక్షులను ప్రభావితం చేయవచ్చుననేది సీబీఐ అపోహ, ఆందోళన మాత్రమే. ఇందుకు సంబంధించి సీబీఐ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు చూపలేదు. కింది కోర్టులు సైతం సీబీఐ అపోహలను నమ్మి నాకు బెయిల్‌ను తిరస్కరించింది. నా హోదాను నాకు వ్యతిరేకంగా ఉపయోగించటం చట్టవిరుద్ధం. 

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే నాటి నుంచి నేను ఎంపీగా ఉన్నాను. భవిష్యత్తులో కూడా కొనసాగుతాను. హోదా కారణంగా బెయిల్ తిరస్కరించడం.. జైలులోనే ఉండాలనడం ఎంత మాత్రం చట్టబద్ధం కాదు. సంబంధం లేని కారణాలతో హైకోర్టు నాకు బెయిల్‌ను తిరస్కరించింది. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. 

నిందితుడు దర్యాప్తులో జోక్యం చేసుకోనప్పుడు, సాక్షులను ప్రభావితం చేయనప్పుడు, దర్యాప్తు పరిధి నుంచి పారిపోనప్పుడు ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చునని, స్వేచ్ఛగా తిరగనివ్వ వచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ నా విషయంలో కింది కోర్టు, హైకోర్టు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాయి. 

సీబీఐ దర్యాప్తు కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే మూడు చార్జిషీట్లు దాఖలు చేయటం జరిగింది. అలాంటప్పుడు నాకు బెయిల్ ఇవ్వటం వల్ల వారికి కానీ, దర్యాప్తుకు కానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అరెస్ట్ చేయవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది.. ఇప్పుడు ఈ కేసులో అటువంటి అసాధారణ పరిస్థితులేమీ లేవు. ఒక వ్యక్తి స్వేచ్ఛను నిరోధించటమంటే.. అది శిక్షించటమే అవుతుంది. 

వివాదాస్పదమైన జీవోలు జారీచేయటానికి బాధ్యులైన వారిపై సీబీఐ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు చేయకుండా విస్మరించింది. దీనికి కారణం వారందరూ కాంగ్రెస్ నాయకులు కావటమే. వారి ప్రయోజనాలు నా ప్రయోజనాలకు విరుద్ధమైనవి. వారి పార్టీ దర్యాప్తు సంస్థను నియంత్రిస్తూ, ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనినిబట్టే.. దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, రాజకీయ ప్రేరేపిత దిశల్లో నడుస్తోందని, నిందితుడి ప్రాథమిక హక్కుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని తేటతెల్లమవుతోంది. 

నేను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిని. రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. దర్యాప్తుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. సాక్షులను ప్రభావితం చేయటం జరగనే జరగదు. అందువల్ల నాకు బెయిల్ మంజూరు చేయండి. బెయిల్ మంజూరుకు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తాను’’ అని జగన్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!