YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

గల్లా - నల్లారి ‘గోల్డ్ వార్’

ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఆధిపత్య పోరు 
మల్లయ్యకొండపై ఏఐసీసీ ప్రముఖుడి కన్ను
బెంగళూరు సంస్థకు లీజు ఇప్పించే ప్రయత్నం.. 
సీఎం చొరవతో ఆగమేఘాలపై కదిలిన లీజు ఫైలు! 
సంతకం చేయటానికి మంత్రి అరుణకుమారి ససేమిరా
సీఎం విచక్షణాధికారంతో లీజుకిస్తే అభ్యంతరంలేదని స్పష్టీకరణ! 

(ఎస్. నగేష్ - తిరుపతి):చిత్తూరు జిల్లాలోని ఇనుము, బంగారు గనుల లీజు వ్యవహారంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి గల్లా అరుణకుమారిల మధ్య ప్రత్యక్ష యుద్ధం నడుస్తున్నట్లు తెలిసింది. తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ మల్లేశ్వరస్వామి ఆలయం కొండల కిందనున్న బంగారు, ఇనుము నిక్షేపాలను ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే విషయంలో వీరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. రూ.60 వేల కోట్ల విలువ చేసే ఇనుప గనులు, రూ.16 వేల కోట్ల విలువైన బంగారు గనులను బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు అప్పజెప్పేందుకు ఏఐసీసీ ప్రముఖుడొకరు చేస్తున్న ప్రయత్నాలకు సీఎం మద్దతిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తనకు వందకు వంద మార్కులు వేయించి పెద్ద సహాయం చేసిన ఆ ముఖ్య నేతను సంతృప్తి పరచటంతోపాటు తన వారికీ ఆదాయ మార్గం చూపటం కోసం సీఎం గనుల పందేరానికి తెర లేపారని కాంగ్రెస్‌లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ లీజుల మంజూరు ఫైలుపై తాను సంతకం చేసేది లేదని మంత్రి తెగేసి చెప్తున్నట్లు సమాచారం.

తిరుపతి ఎన్నికతో తీవ్ర విభేదాలు: చిత్తూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయ సమీకరణల్లో సీఎం కిరణ్, మంత్రి అరుణ ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ సీఎం కుర్చీ ఎక్కిన కొన్నాళ్లకే తనను ఉత్సవ విగ్రహంలా మార్చి విలువ లేకుండా చేశారని అరుణ ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం మీద తీవ్ర ఆరోపణలతో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ కూడా రాశారనే వార్తలు వచ్చాయి. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి వ్యవహారంతో వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తెచ్చింది. ఆ ఎన్నికల్లో తన కుమారుడు జయదేవ్‌కు కాంగ్రెస్ టికెట్ కోసం అరుణకుమారి చివరిదాకా పోరాడారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీలో తన శ్రేయోభిలాషులైన పెద్దలచేత సోనియాకు సిఫారసు చేయించే ప్రయత్నం కూడా చేశారు. అయితే.. జయదేవ్ అభ్యర్థిత్వాన్ని కిరణ్ అడ్డుకున్నారు. తన మద్దతుదారు ఎం.వెంకటరమణకు టికెట్ ఇప్పించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందింది. జయదేవ్‌కు టికెట్ దక్కలేదనే కోపంతో అరుణ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం మద్దతుదారులు ప్రచారం ప్రారంభించారు. కిరణ్ పనిగట్టుకుని ప్రచారం చేయిస్తున్నారని మంత్రి మండిపడుతున్నారు. 

మల్లయ్య కొండ ముసురు: సీఎం, అరుణకుమారిల మధ్య ఉన్న విభేదాలను మల్లయ్య కొండ గనుల వ్యవహారం మరింత పెంచింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న మల్లయ్య కొండల్లో ఇనుము, బంగారు నిక్షేపాలు ఉన్నట్లు బ్రిటిష్ హయాంలోనే నిర్ధారించారు. ఈ నిక్షేపాలను వెలికి తీసే ఉద్దేశంతో 2008లో కేంద్రం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించింది. సుమారు 100 మిలియన్ టన్నుల ఇనుము, 30 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. అయితే, అటవీ ప్రాంతాల్లో గనుల తవ్వకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరి. అందులోనూ మల్లయ్య కొండలవంటి ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు తవ్వకాలు చేపట్టేందుకు పర్యావరణ అనుమతులు రావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, లేదా ఈ రెండింటి భాగస్వామ్యంతో చేపట్టే తవ్వకాలకే అనుమతులు వచ్చే అవకాశముంటుంది. 

ఇదే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్ సూచన మేరకు.. నాటి ముఖ్యమంత్రి వైఎస్.. మల్లయ్య కొండల్లోని నిక్షేపాలను ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), ఎన్‌ఎండీసీ (నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ల సంయుక్త ఆధ్వర్యంలో వెలికి తీయటానికి నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు ఏపీఎండీసీ, ఎన్‌ఎండీసీలు చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చాయి. వైఎస్ మరణం తర్వాత రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇందుకు సంబంధించిన జీవో జారీ అయ్యింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏపీఎండీసీ ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టింది. 

ఆగమేఘాలపై కదిలిన ఫైలు: కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతో బెంగళూరు సంస్థ కూడా మైనింగ్ లీజుల కోసం ప్రాస్పెక్టివ్ లెసైన్స్‌కు దరఖాస్తు చేసింది. మిగతా ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టిన ప్రభుత్వ పెద్దలు.. ఈ ఫైలును ఆగమేఘాలపై నడిపించారు. నిబంధనల ప్రకారం మైనింగ్ లీజు దరఖాస్తు ముందుగా సంబంధిత శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ వద్దకు రావాలి. అక్కడి ఆ శాఖ ఉన్నతాధికారులకు, ఆ తర్వాత మంత్రికి వెళ్లాలి. అక్కడి నుంచి సీఎం వద్దకు వెళ్లాలి. అయితే పెద్దల ఒత్తిడితో చిత్తూరు జిల్లాలోని సంబంధిత అధికారులను హైదరాబాద్‌కే పిలిపించి అధికారిక ప్రక్రియ ముగించి ఆ సంస్థకు ప్రాస్పెక్టివ్ లెసైన్స్ జారీ చేయించటానికి ఆగమేఘాల మీద ఫైలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ ఫైలును గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఆమోదం కోసం పంపినట్లు సమాచారం.

మంత్రిపై ‘పై నుంచి’ ఒత్తిడి: అయితే.. బెంగళూరు సంస్థ ప్రాస్పెక్టివ్ లెసైన్సు అడుగుతున్న 9 చ.కిలోమీటర్ల భూములు రిజర్వ్ ఫారెస్టువి కావటం, ఇందులో ప్రాచీన మల్లేశ్వరస్వామి ఆలయం ఉండటంతో ఆ ఫైలుపై సంతకం చేయడానికి అరుణకుమారి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేత ఒకరు ఏఐసీసీ పెద్దల ద్వారా ఆమెపై తీవ్రస్థాయి ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. అనుమతులేవీ లేకుండా మల్లయ్య కొండ మైనింగ్ లీజుల ఫైలుపై తాను సంతకం చేయలేనని ఆమె కరాఖండిగా చెబుతున్నట్లు తెలిసింది. అవసరమనుకొంటే సీఎం విచక్షణాధికారాన్ని ఉపయోగించి లీజుకు ఆమోదం తెలిపితే తనకు అభ్యంతరం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది.

మంత్రి భయం మంత్రిది: రిజర్వ్ ఫారెస్టులో కేంద్ర పర్యావరణ శాఖఅనుమతి లేకుండానే మైనింగ్ లీజు కట్టబెట్టే ఫైలుపై సంతకం చేస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి అరుణకుమారి భయపడుతున్నట్లు తెలిసింది. అటవీ, రెవెన్యూ రికార్డులు మల్లయ్య కొండలు రిజర్వ్ ఫారెస్టులోనివేనని చెప్తున్నాయి. కానీ.. ఈ కొండల్లో ప్రాస్పెక్టివ్ లెసైన్సుకు పర్యావరణ అనుమతి అక్కర్లేదని ప్రభుత్వ పెద్దలు మంత్రిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అయితే 2006 సెప్టెంబర్ 14న కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన గెజిట్‌లో ప్రాస్పెక్టివ్ లెసైన్సు జారీ చేసే విస్తీర్ణం 50 హెక్టార్లకు లోపు అయితే రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి, అంతకు మించితే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలనే షరతు విధించినట్లు మంత్రి వాదిస్తున్నట్లు సమాచారం. 

పైగా ఈ లెసైన్సులు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చె ందిన మైనింగ్ కార్పొరేషన్లు, సర్వే సంస్థలకు మాత్రమే ఇవ్వాలనే షరతు ఉందని అధికారులు చెప్తుంటే తానెలా సంతకం చేస్తానని మంత్రి వాదిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రి ఆ ఫైలును తన వద్ద పెండింగ్‌లో ఉంచినట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఇనుము విలువే రూ. 60 వేల కోట్లు?: జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2008లో చేసిన సర్వే ప్రకారం మల్లయ్య కొండల్లోని 9 చ.కి.మీ. పరిధిలో 100 మిలియన్ టన్నులకుపైగా ఇనుప ఖనిజం ఉంది. ప్రస్తుతం చైనాలో మొదటి రకం (63% నాణ్యత) ఇనుము ముడి ఖనిజం ధర టన్ను రూ.6,000 దాకా పలుకుతోంది. ఈ లెక్కన 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం విలువే రూ. 60,000 కోట్లకు పైగా ఉంటుందని మైనింగ్ శాఖ అంచనా.

బంగారం విలువ రూ.16 వేల కోట్లకు పైనే!: దేశంలో బంగారు నిక్షేపాలున్న అతి తక్కువ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. ఇక్కడ నాణ్యమైన బంగారు నిక్షేపాలున్నట్లు బ్రిటిష్ హయాం నుంచి జరిగిన అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు జిల్లా సరిహద్దులోని కోలారు బంగారు గనుల్లోని ముడి పదార్థం నుంచి టన్నుకు 30 నుంచి 40 గ్రాముల బంగారం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మల్లయ్య కొండల్లో 30 మిలియన్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉండొచ్చని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నిక్షేపాలు అత్యల్ప నాణ్యతవే అయినా హీనపక్షంలో టన్ను ముడిపదార్థానికి కచ్చితంగా 2 గ్రాముల బంగారం వస్తుందని చెప్తున్నారు. దీని ప్రకారం ఇక్కడి బంగారు నిక్షేపాల విలువ రూ.16,800 కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే అధికార పార్టీ ప్రముఖులు మల్లయ్య కొండల్లో దాగిన బంగారు, ఇనుము ఖనిజాలన్నింటిని వారి పరం చేసుకోవడానికి ప్రాథమిక అనుమతి (ప్రాస్పెక్టివ్ లెసైన్సు) కోసం పైరవీలు చేస్తున్నారు.


ఏఐసీసీ ప్రముఖుడి కన్ను...

కోట్లు కురిపించే మల్లయ్య కొండల్లోని ఇనుము, బంగారు నిక్షేపాలపై ఏఐసీసీ ప్రముఖుడు, కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ప్రముఖుడి కన్ను పడింది. కిరణ్ సీఎం కావటానికి తాను ఎంతో సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఈ గనుల లీజును ఆయన ఆశించినట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. బెంగళూరు కేంద్రంగా విదేశీ - స్వదేశీ కంపెనీల భాగస్వామ్యంతో నడుస్తున్న ఒక సంస్థకు మైనింగ్ లీజులు ఇప్పించాలని ఆ నేత ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్య నేత సంబంధీకులు కూడా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. మల్లయ్య కొండల్లో ఇనుము, బంగారం తవ్వకాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న విషయం బయటకు పొక్కింది. దీంతో ఇక్కడి మైనింగ్ లీజుల కోసం చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులతో పాటు జాతీయ స్థాయిలో కొన్ని ప్రైవేట్ కంపెనీల నుంచి 89 దరఖాస్తులు అందాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!