YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 11 February 2013

ప్రభుత్వం ఉందా... చచ్చిందా

* బడుగుజనంపై ఆప్యాయత చూపిన రాజన్న బిడ్డ 
* అంగడిపేటలో బోనాలతో స్వాగతం పలికిన ప్రజలు
* సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న సర్కార్‌పై షర్మిల ధ్వజం
* వైఎస్ ఉంటే ఎస్‌ఎల్‌బీసీ పూర్తయ్యేదని వెల్లడి 

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. సోమవారం పాదయాత్ర మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి నుంచి చండూరు మండల పరిధిలోని దోనిపాముల, బంగారిగడ్డ, అంగడిపేట మీదుగా ఉడుతలపల్లికి చేరుకుంది. రాజన్న బిడ్డను చూడాలని, తమ సమస్యలు చెప్పుకోవాలని పల్లె జనం తరలివచ్చారు. సాదరంగా ఆహ్వానించి కొండంత అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్ర నాలుగోరోజైన సోమవారం 14.8కిలోమీటర్లు సాగింది. చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. 

పండుగ వాతావ రణం....
పాదయాత్ర సాగిన దారిపొడవునా జనజాతర కనిపించింది. పల్లెల్లో పండుగ వాతావరణాన్ని తలపించింది. షర్మిలతో కరచాలనం చేయడానికి మహిళలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. రోడ్డుపక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు ఆమె వస్తున్న విషయం తెలుసుకుని చూసేందుకు బయటకు వచ్చారు. వారిని చూసిన షర్మిల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారని ఆరా తీశారు. చిన్నారి నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరినీ పకలరిస్తూ ముందుకు సాగారు. వృద్ధులను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు వస్తున్నాయా అని అడిగారు. 

రావడం లేదని వారు చెప్పడంతో ఈ ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఇంతేనని, త్వరలో అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. తాము పొద్దంతా పనిచేసినా రోజుకు రూ. 70కి మించి కూలి అందడం లేదని ఉపాధిహామీ పథకం కూలీలు ఆవేదన వ్యక్తంచేశారు. గీత కార్మికులు పాదయాత్రకు సంఘీభావం తెలిపి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు అధికమవుతుండటంతో తాము కష్టపడి గీసిన కల్లును ఆదరించే వారు కరువయ్యారని గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి నెలకొం దని వివరించారు. బంగారిగడ్డలో ఏర్పాటు చేసిన రచ్చబండలో మహిళలతో ముచ్చటించారు. మహిళలు, రైతులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అందరికీ కష్టాలు తొలగిపోతాయని షర్మిల వారికి ధైర్యం చెప్పారు. 

ప్రభుత్వం ఉందా... చచ్చిందా
బంగారుగడ్డలో రచ్చబండలో, చండూరులో జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. కిరణ్ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు పాలన-2ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజలకు తాగునీరు కూడా అందించలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే హక్కులేదన్నారు. ఏ పల్లెలో చూసినా తాగడానికి గుక్కెడు నీళ్లందని పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వం ఉందా... చచ్చిందా అనే సందేహం వస్తుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు కుర్చీల కోసం ఆరాటపడటమే గానీ ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఫ్లోరైడ్ నివారణకు రూ.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తుచేశారు. మహానేత వైఎస్సార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే రూ.375 కోట్లు ఖర్చు చేసి 450 గ్రామాలకు కృష్ణా జలాలు అందించారని కొనియాడారు. ఆయన మరణాంతరం వచ్చిన ప్రభుత్వాలు ఒక్క గ్రామానికి కూడా తాగునీరి చ్చిన పాపానపోలేదన్నారు. మహానేత బతి కుంటే మిగతా మిగిలిన 500 ఫ్లోరోసిస్ గ్రామాలకు మంచినీరు సరఫరా అయ్యేదన్నారు. అంతేగాక ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి నాలుగు లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసేవారని ఆమె పేర్కొన్నారు. 

తరలొచ్చిన జనవాహిని...
చండూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగన్, వైఎస్సార్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ప్రభుత్వాన్ని తన ప్రసంగంలో విమర్శించిన ప్రతిసారీ ప్రజలు చప్పట్లు కొట్టారు. రాజన్న చేసిన సేవలను ప్రస్తావించినప్పుడల్లా కేరింతలు కొట్టారు. అంగడిపేటలో మహిళలు షర్మిలకు బోనాలతో స్వాగతం పలికారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!