YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 February 2013

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర

అగస్టా కుంభకోణంలో ఎమ్మార్‌కు చెందిన వ్యక్తి కీలకపాత్ర పోషించారు
ఆ సంస్థతో మొదటి నుంచీ లింకులున్నది ఎవరికి?
హెలికాప్టర్ల కుంభకోణానికీ వైఎస్ కుటుంబాన్ని ముడిపెడతారా?
స్కాంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించకుండా వైఎస్ కుటుంబానికి అంటగడతారా? 
కాంగ్రెస్ సర్కారును మోస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ యత్నం 
బాబు కొన్న బెల్-430 కాప్టరే వైఎస్ ప్రాణాలు బలిగొందని రేవంత్ గమనించాలి 

 ‘‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో ఎమ్మార్ సంస్థకు చెందిన ఒక వ్యక్తి కీలకపాత్ర పోషించినట్లు సమాచారం వెలువడుతోంది. ఎమ్మార్ అనే సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది ఎవరు? ఆ సంస్థతో ఒప్పందం కోసం దుబాయి వెళ్లి 3 రోజులు పర్యటించిదెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మార్‌కు హైదరాబాద్ నడిబొడ్డున 535 ఎకరాలు పప్పుబెల్లంలా కట్టబెట్టింది ఎవరు? వీటన్నింటికీ చంద్రబాబు తాబేదార్లు సమాధానం చెప్పాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిని ధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ పరిశీలిస్తే హెలికాప్టర్ల కుంభకోణంలో కూడా చంద్రబాబు నిష్ణాతులుగా వెల్లడవుతోందన్నారు. వైఎస్‌ను బలిగొన్న బెల్-430 హెలికాప్టర్ క్రాష్ అవటానికి చంద్రబాబు హస్తం కూడా ఉన్నట్లుందని గట్టు అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ మరణంపై నెలకొన్న అనుమానాలపై చంద్రబాబు నోరు మెదపకపోవటం కూడా అందులో భాగమేనా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి బాగోతాల గురిం చి మాట్లాడితే రోజుల తరబడి చెప్పినా తరగనిదని, ఆయనపై కమ్యూనిస్టు పార్టీ పుస్తకాలు ముద్రించిందని గుర్తుచేశారు. గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి సంఘటనతోనూ మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి సంబంధం అంటగట్టి బురద చల్లకపోతే చంద్రబాబు, ఆయన తాబేదార్లకు నిద్రపట్టేట్లులేదని ఎద్దేవా చేశారు. 

పైశాచిక ఆనందానికి పరాకాష్ట... : వైఎస్ కుటుంబాన్ని విమర్శించకపోతే తాము బతికి బట్టకట్టే పరిస్థితిలేదనే భయం వారిలో నెలకొన్నట్లుందని గట్టు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పెద్దల హస్తంతో జరిగిన హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వైఎస్ కుటుంబ ప్రమేయం ఉందని పేర్కొన టం టీడీపీ పైశాచికానందానికి నిదర్శనమని మండిపడ్డారు. అగస్టా హెలికాప్టర్ కొనుగోళ్లలో భాగంగా బయటపడ్డ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినది కూడా ఉన్నట్లయితే విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి అగస్టా హెలికాప్టర్ల కొనుగోలులో జరిగిన అవకతలపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ప్రశ్నించకపోగా.. దాన్ని వైఎస్ కుటుంబానికి అంటగట్టే ప్రయత్నం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రజలను కష్టాల పాలుచేస్తున్న కాంగ్రె స్ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నందు వల్లే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఆయ న తాబేదార్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని గట్టు విమర్శించారు. 

బెల్-430 కొన్నది బాబే కదా! : దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రాణాలను బలిగొన్న హెలికాప్టర్‌పై టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన పలు అనుమానాలు లేవనెత్తారు. ‘‘అవినీతితో కొనుగోలు చేసిన హెలికాప్టర్ వల్లే రాజశేఖరరెడ్డి మరణించారని రేవంత్ చెప్తున్నారు! అయితే బెల్-430 హెలికాప్టర్ కొనుగోలు చేసింది చంద్రబాబే అనే విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలి. ప్రమాదం జరిగిన ఆ హెలికాప్టర్ కొనుగోలులో చంద్రబాబు ఏమేర అవినీతికి పాల్పడ్డారో ప్రభుత్వం విచారణ చేపట్టాలి. రేవంత్ సైతం వారి పార్టీ అధినేతకు వత్తాసు పలకకుండా ఇదే డిమాండ్ చేయాలి. అగస్టా హెలికాప్టర్ ఎగరటానికి పనికి రాకపోతే.. చంద్రబాబు కొనుగోలు చేసిన బెల్-430 ప్రాణాలు బలిగొందనే విషయాన్ని ఆయన గమనించాలి’’ అని గట్టు పేర్కొన్నారు. 

బాబుకు ప్రజలు విధించిన శిక్ష...: వ్యవస్థలను మేనేజ్ చేసి శిక్షలు తప్పించుకున్న చంద్రబాబుకు ప్రజాకోర్టు విధించిన శిక్షను అనుభవిస్తున్నారని గట్టు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను నరకంలోకి నెట్టినందుకే వారు విధించిన శిక్షను నేడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. ‘బిల్‌క్లింటన్, టోని బ్లేయర్‌లతో కలిసి టీ తాగాను, ప్రపంచంలో చక్రం తిప్పానంటూ చెప్పుకున్న చంద్రబాబును ఒక్క తోపు తోస్తే దేశంలో వచ్చి పడ్డారు. ఫోన్‌ల ద్వారా దేశ ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపిక చేసిందే తానే అంటూ చెప్పుకున్నారు. అక్కడ ఒక్క తోపు తోస్తే రాష్ట్రంలో పడ్డారు. ఇక్కడ ప్రజలు లాగికొడితే నడివీధిలో పడ్డారు’ అని గట్టు ఎద్దేవా చేశారు. వీధుల వెంట తిరుగుతున్న చంద్రబాబు ప్రజలకు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా వైఎస్ పాలనలో ఇచ్చినవన్నీ తానూ అందిస్తానని చెప్పుకోవటాన్ని బట్టే ఆయన పరిపాలన ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలకు చంద్రబాబు పట్ల విశ్వసనీయత, మాటమీద నిలబడే మనస్తత్వం లేనందు వల్లే ఆయన్ని నమ్మడంలేదన్నారు. టీడీపీ నమ్ముకున్న పార్టీ నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు సైతం ఆ పార్టీని వదిలి వెళ్లటం.. బాబుపై నమ్మకం లేకపోవటం వల్లనేనని తేటతెల్లమవుతోందన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!