YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

వైఎస్ జగన్‌ను విచారించిన సీబీఐ



భద్రతా కారణాల రీత్యానే మార్పు చేశామన్న సీబీఐ అధికారులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం విచారించారు. మొదటి రోజు విచారణలో భాగంగా జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆ శాఖ అధికారుల మెస్‌లో విచారణ జరిపారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని ఉదయం 10.30 గంటలకు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చిన జగన్.. చిరునవ్వుతో అందరికీ అభివాదం చేశారు.

సీబీఐ ఏర్పాటుచేసిన వాహనంలో ఆయన్ను జైలు ప్రధాన ద్వారానికి కుడివైపున ఉన్న జైళ్లశాఖ ఉద్యోగుల క్వార్టర్‌లలో నుంచి అధికారుల మెస్‌కు తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఎవర్ని కస్టడీలోకి తీసుకున్నా.. సీబీఐ అధికారులు దిల్‌కుశ అతిథి గృహంలోనే విచారించారు. గత నెల 25 నుంచి మూడు రోజులపాటు జగన్‌మోహన్‌రెడ్డిని కూడా అక్కడే విచారించారు. ఇప్పుడు కూడా దిల్‌కుశ అతిథి గృహంలోనే ఆయన్ను విచారిస్తారని మొదట భావించినప్పటికీ.. దాన్ని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి మారుస్తున్నట్లు శనివారం సాయంత్రం సీబీఐ అధికారులు అనధికారికంగా తెలిపారు. తీరా ఆదివారం ఉదయానికల్లా విచారణ స్థలాన్ని అనూహ్యంగా జైళ్లశాఖ డీజీ కార్యాలయ ఆవరణలోకి మార్చారు. భద్రతా కారణాలరీత్యానే జగన్‌ను జైళ్ల శాఖ డీజీ కార్యాలయ ఆవరణలో విచారించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

జగన్‌ను కలిసిన వైఎస్ భారతి..: జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ హెచ్ వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్‌లు విచారించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకున్నారు. భోజన విరామ సమయం అనంతరం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. మధ్యాహ్నం సమయంలో జగన్ సతీమణి వైఎస్ భారతి చంచల్‌గూడకు వచ్చారు. అయితే, పోలీసు సిబ్బంది ఆమెను జైళ్లశాఖ ఆవరణలోకివెళ్లేందుకు అనుమతించలేదు. న్యాయవాది అశోక్‌రెడ్డి బయటకు వచ్చి.. పోలీసులకు చెప్పడంతో ఆమెను అనుమతించారు. భోజన విరామ సమయంలో కొద్ది సమయం అక్కడ ఉండి ఆమె తిరిగి వెళ్లిపోయారు. సౌత్ జోన్ డీసీపీ అకున్ సబర్వాల్ బందోబస్తును పర్యవేక్షించారు.

చంచల్‌గూడ జైలు వెనుక భాగంలో ఉన్న డీజీ కార్యాలయ ఆవరణలోని అధికారుల మెస్‌లో విచారణ జరుగుతున్నందున ఆ ప్రాంతాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారానికి వెళ్లే రహదారిని రెండువైపులా దిగ్బంధనం చేశారు. బారికేడ్‌లు, ముళ్లకంచెలు వేశారు. సాయంత్రం ఐదు గంటల తరువాత ట్రాఫిక్‌ను యథావిధిగా అనుమతించారు. జగన్‌మోహన్‌రెడ్డిని విచారణ స్థలానికి తీసుకెళ్లే వాహనం వెంట మరో రెండు వాహనాలలో పోలీసు సిబ్బంది భద్రతగా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగించుకుని, తిరిగి చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లే సమయంలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క నిమిషం ఆగి అభివాదం చేసి లోపలికి వెళ్లారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!