YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 5 October 2012

ఈడీ కంటే ముందే ఎల్లో మీడియాకు లీక్ చేసిన టీడీపీ

ఆ మీడియాకు స్వయంగా అందజేసిన టీడీపీపీ నేత నామా
కాంగ్రెస్‌తో కుమ్మక్కులో భాగంగానే చిదంబరంతో భేటీ
నోట్ బాగోతంలో తనవంతు పాత్ర పోషించిన సీబీఐ
జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు ముందే విడుదలయ్యేలా పావులు

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వీలైనంత ఎక్కువ కాలం ప్రజలకు దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ ఆడుతున్న దుష్ట రాజకీయ క్రీడ బట్టబయలైంది. ఇందుకోసం ఎప్పట్లాగే దర్యాప్తు సంస్థ సీబీఐని పావుగా వాడుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తనతో నిస్సిగ్గుగా అంటకాగుతున్న విపక్ష టీడీపీని కూడా ఢిల్లీ స్థాయిలో ఈ పథకంలో భాగస్వామిగా మార్చుకున్న వైనంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

జగన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) చర్యల విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో చంద్రబాబు గురువారం ఫోన్‌లో మంతనాలు జరపడం తెలిసిందే. దాంతోపాటు విశ్వసనీయ సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం ఈడీ విడుదల చేసిన ఆస్తుల అటాచ్‌మెంట్ నోట్‌ను కూడా మధ్యాహ్నానికే టీడీపీ అనుకూల తెలుగు మీడియాకు టీడీపీ ఎంపీల ద్వారా బాబు చేరవేశారు. ఈడీ ఇంకా విడుదల చేయకముందే టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు దాన్ని స్వయంగా తెలుగు మీడియాకు అందజేశారు! పైగా నామా నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం టీడీపీ ఎంపీల బృందం బాబు లేఖ తీసుకుని చిదంబరంతో భేటీ అవడానికి ముందే ఈడీ నోట్ గురించి ఎల్లో మీడియాకు పక్కాగా ఉప్పందింది.

సీబీఐ కూడా ఈ విషయంలో తన వంతు పాత్ర పోషించడం ద్వారా యథాశక్తి సహకరించింది. శుక్రవారం జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో అంతకుముందే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ నోట్ విడుదలయ్యేలా పావులు కదిపింది.

కాంగ్రెస్ నాయకత్వం కూడా టీడీపీని దువ్వే చర్యలను దాచుకోవడానికి ప్రయత్నించడం లేదు. పైగా ఆ పార్టీని మున్ముందు మరింతగా ‘పోత్సహిస్తా’మంటూ సంకేతాలు కూడా ఇస్తోంది. ఏఐసీసీలోకి ఒక ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. చంద్రబాబుతో కేంద్ర ఆర్థిక మంత్రి మాటామంతీ నిజమేనా అని ప్రశ్నించగా, ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నామని కుండబద్దలు కొట్టారాయన. పైగా, ‘ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. అదీగాక శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అవుతాడుగా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అక్కడితో ఆగకుండా, ‘చంద్రబాబు కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నారుగా’ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నిష్ర్కమణ నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం మెజారిటీ త్రిశంకు స్వర్గంలో ఉన్నందున చిన్న, ప్రాంతీయ పార్టీలను కూడా కూడగట్టుకోవాలన్న వ్యూహం కూడా టీడీపీతో కాంగ్రెస్ దోస్తీకి మరో కారణంగా కన్పిస్తోంది. ప్రభుత్వ మనుగడకు ఢోకా లేకుండా చూసుకోవడంతో పాటు శత్రువుపై దాడికి కూడా ఇది ఉభయతారకంగా పనికొస్తుందన్నది ఏఐసీసీ పెద్దల భావనగా తెలుస్తోంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!