YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 3 October 2012

బాబూ.. మీకంత సీన్ లేదు :ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

- వైఎస్ పాదయాత్రకు ఏదీ సాటి రాదు
- తొమ్మిదేళ్ల పాలనలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేశావు బాబూ!
- బాబు పాదయాత్రను మధ్యలోనే ముగించడం ఖాయం 

హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పగటి కలలు కంటున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చంద్రబాబుకు అంత సీన్ లేదని చెప్పారు. వైఎస్ పాదయాత్రకు ఏదీ సాటి రాదని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ తాత మౌలానా మహ్మద్ అబ్దుల్ వాహెద్ ఒవైసీ 37వ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం రాత్రి మోతీగల్లీలో జరిగాయి. 

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ తదితరులు అబ్దుల్ వాహెద్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. పాదయాత్రలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేయాలి గానీ, అధికారం కోసం చేస్తే ప్రజలు విశ్వసించరని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ర్ట ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ముఖ్యమంత్రి కాగలిగారని చెప్పారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్ ఎంతో కృషి చేశారని చెప్పారు.

వైఎస్ పాదయాత్రను కాపీ కొడుతున్న చంద్రబాబుకు నిరాశే ఎదురవుతుందని అన్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయని బాబు.. ముస్లింలకు తగిన సీట్లు ఇస్తానని కొత్తగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను నమ్మించడం కష్టమని, గ్రామాల్లో ముస్లిం మైనార్టీలు బాబును తరిమి తరిమి కొడతారని చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర మధ్యలోనే ముగించుకొని తిరిగి రావడం ఖాయమని అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా అమెరికాలో రూపొందించిన చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అసదుద్దీన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, అఫ్సర్‌ఖాన్, ఎమ్మెల్సీలు జాఫ్రీ తదితరులు కూడా పాల్గొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!