YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 16 November 2012

సిబిఐ నత్తనడక

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=52610&Categoryid=28&subcatid=0

Written by Nagarjuna On 11/16/2012 7:00:00 PM
సిబిఐ తీరుని ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా దానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కాంగ్రెస్ కనుసన్నల్లో మెలుగుతూ సిబిఐ విశ్వసనీయత కోల్పోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాలమీద సిబిఐ రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించింది. దర్యాప్తు పూర్తి చేయడంలో మాత్రం సిబిఐ తీవ్ర జాప్యం చేస్తోంది. జగన్ ను అరెస్ట్ చేసి అయిదు నెలలు దాటినా ఇప్పటివరకు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. విచారణ పూర్తి చేయకుండా, ఛార్జిషీట్ దాఖలు చేయకుండా జగన్ బెయిలుకు కూడా అడ్డుపడుతోంది. దర్యాప్తు ప్రారంభించడంలో సిబిఐ చూపిన వేగం, చురుకుదనం పూర్తిచేయడంలో కనిపించడంలేదు.

సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో ఈరోజు రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన తరఫున దాఖలైన ఈ రెండు పిటిషన్లలో ఒకటి చట్టపరమైన(స్టాట్యుటరీ)ది కాగా, రెండవది సాధారణ బెయిల్ పిటిషన్‌. ఈ ఏడాది మే 27న సిబిఐ అధికారులు జగన్ ను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలి. అయితే సిబిఐ ఇంకా దాఖలు చేయలేదని జగన్‌ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలన్న నిబంధన చట్టంలో ఉంది. దాని ప్రకారం జగన్ కు బెయిలు మంజూరు చేయాలి. ఇదే విషయాన్ని జగన్‌ తన పిటిషన్ లో తెలిపారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 167(2) కింద చట్టపరమైన బెయిల్ పిటిషన్‌ను, సెక్షన్‌ 437 కింద సాధారణ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సాక్షి పెట్టుబడుల కేసుకు సంబంధించిన జగన్ ను మే 27న అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19 కింద అరెస్టు చేసి, అదే నేరంలో జగన్ ను రిమాండ్‌కు ఇవ్వాలని కూడా సీబీఐ కోరింది. సీసీ నెంబరు 8 కింద కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించింది. ఇదే కేసులో జగన్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని సీబీఐ కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా తిరస్కరించటంతో జులై 27న ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. అప్పటికి చట్టపరమైన బెయిల్ పొందడానికి నిర్దేశించిన 90 రోజుల గడువు పూర్తి కాలేదు. దాంతో సుప్రీంకోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19లో ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవటాన్ని ప్రస్తావిస్తూ, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

నిజానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు అడిగినపుడు, అప్పటి నుంచి 90 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ తన దర్యాప్తును పూర్తిచేయాలి. జగన్ ను సీసీ నెంబరు-8లో తెలిపిన ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ కేసులోని ఇతర నేరాలకు సంబంధించి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న కారణంతో బెయిల్ తిరస్కరించారు. ఆ దర్యాప్తును 90 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు పూర్తి చేయనందున చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక కేసులో దర్యాప్తు పూర్తికాని అంశాలకు సంబంధించి చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, సీసీ నెంబరు 8కు సంబంధించి తనను రిమాండ్‌లో ఉంచటంలో అర్థం లేదని పేర్కొంటూ జగన్ తరపున మరో సాధారణ బెయిల్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.

దర్యాప్తు పూర్తి కాలేదన్న సాకుతో ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం రిమాండ్ లో ఉంచడం భావ్యంకాదన్న భావనతోనే ఈ 90 రోజుల నిబంధనను చట్టంలో పొందుపరిచారు. జగన్ ను అరెస్ట్ చేసి 174 రోజులు గడిచినా దర్యాప్తు పూర్తి కాని పరిస్థితులలో బెయిల్ కు అడ్డుపడటం భావ్యంకాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జన నేత జగన్ కు బెయిల్ రావాలని రాష్ట్రంలోని అత్యధిక మంది జనం కోరుకుంటున్నారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ జనంలోకి వస్తారని ఆశిద్దాం.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!