YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 21 November 2012

కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా....

 కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు తీరు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, ప్రజాప్రతినిధుల పాత్రను ఇసుమంత కూడా తేల్చకుండా ఏసీబీ చేతులు దులుపుకుంది. సిండికేట్ ముడుపుల వ్యవహారంలో హైకోర్టుకు సమర్పించిన నివేదిక, దాని సారాంశంతో కూడిన 50 పేజీల ప్రత్యేక నివేదికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సిండికేట్ వ్యాపారుల పేర్లను మాత్రమే చేర్చి పని అయిందనిపించింది. ఈ నివేదికలో సుమారు 1,100 మంది పేర్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో దాదాపు 360 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏసీబీ సమర్పించిన నివేదికలో సిండికేట్ వ్యాపారులు, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారుల పేర్లున్నాయి. 

మొత్తం 48 కేసుల్లో దాదాపు 165 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరో 100 మంది ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులను కూడా నిందితులుగా ఏసీబీ పేర్కొంది. వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించిన వెంటనే ఈ కేసుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన మరో 400 మందిపై శాఖాపరమైన విచారణ జరపాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలియజేసింది. ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌ను కోరినట్లు ఏసీబీ దర్యాప్తు అధికారులు వివరించారు. 

నున్నా వెంకటరమణ, బాలరాజుగౌడ్‌తోపాటు 16 జిల్లాలకు చెందిన మద్యం సిండికేట్ వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులు 85 మందిని కూడా ఏసీబీ నిందితులుగా పేర్కొంది. సిండికేట్ ముడుపుల వ్యవహారంలో రూ.60 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు చేతులు మారాయని హైకోర్టుకు వివరించింది. ముడుపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లలేదని తెలిపింది. మద్యం టెండర్లకు ముందే సిండికేట్ అవడం ద్వారా కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, ఆ విషయంలో ఎక్సైజ్ అధికారుల పాత్ర నిర్ధారణ అయిందని వివరించింది. మద్యం దుకాణదారుల్లో 3,000 మంది వరకు తెల్లకార్డుదారులు కూడా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. వీరి తెల్లకార్డులను రద్దు చేసే విషయంలో మీనమేషాలు లెక్కించిన సివిల్ సప్లైస్ విభాగం అధికారులపైనా చర్యలకు ఏసీబీ సిఫారసు చేసినట్లు సమాచారం. బోగస్ రేషన్ కార్డుల మంజూరు విషయంలో రెవెన్యూ అధికారుల పాత్రను కూడా ఏసీబీ ఆ నివేదికలో వివరించింది.

సిండికేట్‌ల వద్ద లెక్కలున్నాయ్.. కానీ..
మద్యం సిండికేట్ వ్యాపారులు నున్నా వెంకటరమణ, బాలరాజుగౌడ్ తదితరులు ఇచ్చిన ముడుపుల వివరాలను తమ విచారణలో వెల్లడించారని, అందుకు సంబంధించిన అనుబంధ ఆధారాలు మాత్రం దొరలేదని హైకోర్టుకు అందించిన నివేదికలో దర్యాప్తు అధికారులు వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పినట్లు సిండికేట్ పద్దుల్లో ఆధారాలు లభించాయని, డబ్బులు చేతులు మారినట్లు నిర్ధారించే కచ్చితమైన సమాచారం మాత్రం విచారణలో లభించలేదని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సంబంధించిన వ్యక్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణపై వచ్చిన ఆరోపణలపైన కూడా కచ్చితమైన ఆధారాలు లభించలేదని ఏసీబీ చేతులెత్తేసింది. ఈ నివేదిక సారాంశాన్ని పరిశీలిస్తే మద్యం సిండికేట్‌లను వెనుక నుంచి నడిపిన బడా నేతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!