YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 24 November 2012

అడుగడుగునా బ్రహ్మరథం

* అప్రతిహతంగా ‘మరో ప్రజాప్రస్థానం’ 
* అడుగడుగునా బ్రహ్మరథం 
* కొంకాల గ్రామంలో పాదయాత్రకు ఘనస్వాగతం
* బియ్యం ఇవ్వడం లేదని.. పింఛన్ ఆపేశారని మహిళల ఏకరువు
* జగనన్నను ఆశీర్వదించండి.. సమస్యలు తీరుస్తాడని షర్మిల హామీ 

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
మూడు రోజులు - 40.6 కిలోమీటర్లు


ఊళ్లకు ఊళ్లే ‘మరో ప్రజాప్రస్థానం’ వెంట కదం కలిపాయి.. పదులు.. వందలు..వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. రాజన్నరాజ్యం రావాలని.. కష్టాలు తీర్చాలని నినదించాయి. రూపాయి బియ్యం ఇవ్వడం లేదని..పింఛన్లు ఆపేశారని మహిళలు, వృద్ధులు పాదయాత్రలో షర్మిలతో చెప్పుకున్నారు. కరెంట్ రాక..పంటలకు నీళ్లందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్షం కుమ్మకై కుట్రలతో జగనన్నను బంధించాయని షర్మిల దుయ్యబట్టారు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారని..రాజన్నరాజ్యం తెస్తారని .. కన్నీళ్లు తుడుస్తారని భరోసా ఇస్తూ ముందుకు సాగారు... 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ప్రజా సమస్యలను విస్మరించిన అధికార కాంగ్రెస్‌పార్టీ, దానికి అంటకాగుతున్న ప్రతిపక్ష టీడీపీల వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ అడుగడుగునా జనం నీరాజనం మధ్య అప్రతిహతంగా సాగుతోంది. శనివారం నాటికి 508 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. 38 రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయ నుం చి ప్రారంభమైన యాత్ర అనంతపురం, క ర్నూలు జిల్లాల మీదుగా నాలుగురోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించింది. శనివారం అలంపూర్ నియోజకవర్గం కొంకాల గ్రామం చేరుకునే సమయానికి యాత్ర 500 కిలోమీటర్లు పూర్తయింది. దీంతో ఆ గ్రామప్రజలు భారీగా తరలొచ్చిన షర్మిలకు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముందు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట వరదలు వచ్చి ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు అండగా నిలిచి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో రాజన్నరాజ్యం వస్తుందని అన్ని సమస్యలూ తీరుతాయని అప్పటి వరకు కాస్త ఓపికపట్టాలని ధైర్యం చెప్పారు. ‘‘ ప్రతి పేద కుటుంబాల్లో పెద్ద చదువులు చదవాలనే ఆశయంతో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెడితే ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. ఎక్కడైనా ప్రమాదాలకు గురైతే వారిని వెంటనే ఆస్పత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించేందుకు వీలుగా 108 వాహనాలను ఏర్పాటుచేస్తే ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్రమైన విద్యుత్‌కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిర్లక్ష్యమేనన్నారు. మహానేత బతికిఉంటే 9 గంటల పాటు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేవారని గుర్తుచేశారు. 

ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీల కుట్ర
ప్రజలకష్టాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తుంటే పాలకపక్షం, ప్రతిపక్ష ఓర్వలేకపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతామనే భయంతో కుమ్మక్కై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టించారన్నారు. దేవుడి ఆశీస్సులతో పాటు ప్రజల అండదండలు ఉన్నందున త్వరలో జగనన్న బయటకు వస్తాడన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే పేదలకు ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తాడని హామీఇచ్చారు. రైతులు కూడా గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడకుండా రూ.35 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి ఆదుకుంటాడని వెల్లడించారు. 

జగనన్న సీఎం కావాలి..
కొంకాల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రేషన్ బియ్యం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. రాజన్నరాజ్యం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం అందుతాయన్నారు. ‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నాన్న చేయి విరిగితే ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఆపరేషన్ చేశారు. వైఎస్ మరణానంతరం మా నాన్నమ్మకు కేన్సర్ వస్తే చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్తే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మృతిచెందింది..’’అని మరో ఓ మహిళ కంట తడిపెట్టింది. 

పేదల బతుకుల్లో వెలుగు రావాలంటే జగనన్న సీఎం కావాలని ఆకాంక్షించారు. అనంతరం వెంకటాపురం స్టేజీ వద్ద షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు సమస్యలు పట్టించుకోకుండా వారిని తీవ్రమైన క్షోభకు గురిచేస్తుందన్నారు. ఎవరూ ఆధైర్యపడొద్దని త్వరలోనే జగనన్న జైలు నుంచి బయటకు వచ్చి పేదలకన్నీళ్లు తుడుస్తాడని షర్మిల ప్రజలకు భరోసాఇచ్చారు. శనివారం బూడిదపాడు క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర శాంతినగర్, 26 కాల్వ, కొంకాల, పెదతాండ్ర పాడు క్రాస్‌రోడ్డు, వెంకటాపురం స్టేజీ శివారు ప్రాంతం వరకు కొనసాగించి ఆ రాత్రికి షర్మిల అక్కడే బసచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!