YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 18 November 2012

నీరు పారినప్పుడైనా వైఎస్ గుర్తుకురాలేదా?


‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల స్వప్నాల్లో ఒకటైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఇవాళే ప్రారంభమైంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు అది. ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తై. బీడు భూములకు సాగు నీళ్లు అందుతున్నాయంటే అందుకు కారణం రాజన్న. రూ.4,000 కోట్లు ఖర్చు చేసి రాజన్న 95 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే.. కేవలం రూ.40 కోట్లు ఖర్చు చేసి మొదటి దశ పనులు పూర్తి చేయడానికి వీళ్లకి మూడేళ్లు పట్టింది. 

ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. అందరి పేర్లూ చెప్పారట.. కాని 4 వేల కోట్లు ఖర్చు చేసి 95 శాతం పనులు పూర్తి చేసిన వైఎస్సార్ పేరు మాత్రం ఒక్కసారంటే.. ఒక్కసారి కూడా ప్రస్తావించలేదట. మంచితనాన్ని గుర్తు పెట్టుకోవడం సంస్కారం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తికి ఆమాత్రం సంస్కారం లేకపోవడం దురదృష్టకరం. ఆ ప్రాజెక్టు ప్రారంభించినపుడు.. గలగలా నీళ్లు పారినప్పుడైనా వైఎస్ గుర్తురాలేదా మీకు?’’ అని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దాన్ని అవిశ్వాసంతో దించేయకుండా అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 32వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సాగింది. సి.బెళగల్, పొలకల్ గ్రామాల్లో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. హంద్రీ-నీవాపై మాట్లాడుతున్నప్పుడు షర్మిల తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గుండెల్లో పెల్లుబుకుతున్న బాధతో ఆమె స్వరం జీరబోయి కొద్దిసేపు మాటలు రాలేదు. భూమా దంపతులు శోభా నాగిరెడ్డి, నాగిరెడ్డి ఆమెను సముదాయించారు.



కిరణ్.. రాజన్న వల్లే మీకు ఈ పదవి

‘‘ప్రాజెక్టు కోసం అహర్నిశలు తపించిన దివంగత నేత రాజన్న పేరును సీఎం కిరణ్ ప్రస్తావించకపోవడం దుర్మార్గం. రాజన్న జనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజలు ఆయన్ను కావాలనుకున్నారు. వైఎస్సార్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓటేశారు. సీల్డు కవర్‌లో వచ్చే ముఖ్యమంత్రి కోసం కాదు. వైఎస్సార్ పెట్టిన భిక్షతో అధికారం అనుభవిస్తున్న వారే ఆయనపైఎంత ద్వేషం పెట్టుకున్నారో ఇప్పుడు బయటపడుతోంది. మీకు(కిరణ్‌కు) ఇవాళ ఈ పదవి రావడానికి కారణం వైఎస్సార్. ఆవేళ వైఎస్సార్ మిమ్మల్ని స్పీకరుగా చేసి ఉండకపోతే.. మీరు సోనియా దృష్టిలో పడేవారా? సీఎం పదవి మీకు దక్కేదా? ఇవాళ మీరు పేరు ప్రస్తావించకపోయినా.. ప్రజల గుండెల్లో రాజన్న ఉన్నారు. గలగలపారే నీళ్లలో రాజన్న కనిపిస్తాడు’’ అని షర్మిల ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఎన్నికల కోసం వాడుకొని రెండు సార్లు శిలాఫలకం వేసి వదిలేశారని, వైఎస్ వచ్చాక చిత్తశుద్ధితో 95% పనులు పూర్తి చేశారని ఆమె గుర్తుచేశారు.

ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉంది..

‘‘వైఎస్సార్‌తోనూ, ఆయన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డితోనూ పోటీ పడలేమని ఇటు చంద్రబాబుకు, అటు కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలుసు. ప్రజల మనుసులో స్థానం సంపాదించుకున్న జగన్ లోపల ఉంటేనే.. బయట మన మనుగడ ఉంటుందనే ఆలోచనతో ఈ ఇద్దరు కలిసి అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలులో పెట్టించారు. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద ఉన్నప్పటికీ ఆయన మాత్రం అవిశ్వాసం పెట్టనంటారు. కారణం ఏమిటంటే వాళ్లిద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. చంద్రబాబు అక్రమాలను తెహల్కా బయటపెట్టింది, కమ్యూనిస్టులు బయటపెట్టారు. రిలయన్స్‌కు గ్యాస్ బ్లాకుల కేటాయింపులో, ఐఎంజీకి భూముల ధారాదత్తంలో అక్రమాలు ఉన్నాయని బయటపడినా ఈ ప్రభుత్వం చంద్రబాబు మీద ఎలాంటి విచారణ జరపదు. అందుకు బదులుగా బాబు.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, అధికార పక్షానికి అండగా నిలబడుతున్నారు’’ అని షర్మిల కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కుపై నిప్పులు చెరిగారు.

షర్మిల పాదయాత్రకు మైసూరా సంఘీభావం

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్రకు రాజ్యసభ మాజీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి సంఘీభావం తెలిపారు. ఆదివారం ఉదయం షర్మిల బస చేసిన కంపాడు గ్రామానికి వచ్చి ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పాదయాత్ర చేశారు. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాశ్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆదివారం కూడా యాత్రలో పాల్గొన్నారు.

పార్టీలో చేరిన మాజీ మంత్రి కుమారుడు

మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మూడుమాల శంకర్‌రెడ్డి కుమారుడు మూడుమాల రామకృష్ణారెడ్డి, గత ఎన్నికల్లో పాణ్యం పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సోదరుడు ఎదురూరు రాంభూపాల్ రెడ్డి ఆదివారం షర్మిల సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!