YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 11 December 2012

కాంగ్రెస్‌ను కాపాడటమే టీడీపీ ఎజెండా


కేంద్రం, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను కాపాడటమే టీడీపీ ఎజెండాగా మారిందని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే తేనేటి వనిత దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆమె మంగళవారం చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీలో చేరిన తరువాత జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. టీడీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైన తరువాత రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. రాజ్యసభలో ఇటీవల ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో టీడీపీ ఎంపీలు గైర్హాజరు కావటంతో కాంగ్రెస్‌తో ఆ పార్టీ దోస్తీ మరింత బట్టబయలైందన్నారు. ఎలాంటి కారణం లేకుండానే తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదన్నారు. అయితే ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా గైర్హాజరైన ముగ్గురు పార్టీ ఎంపీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. టీడీపీలో డబ్బున్నవారికో న్యాయం, ఇతరులకో న్యాయం పాటిస్తున్నారనే విషయం తేటతెల్లమైందని విమర్శించారు. ప్రజల అభీష్టం మేరకే వైఎస్సార్ సీపీలో చేరానని, పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వనిత చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నాటుకుపోయాయని, అవి తిరిగి అమలవ్వాలంటే.. జగన్ వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!