YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 8 August 2012

వైఎస్ పథకాలు ఎత్తేసే కుట్ర

- ఫీజుల పథకాన్ని నీరుగార్చడానికి మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోంది
- ఫీజుల చెల్లింపు పథకాన్ని తానే ప్రవేశపెట్టానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలాడుతున్నారు 

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ ప్రజలు ఆయన్ని మర్చిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఫీజుల పథకాన్ని నీరుగార్చేందుకే మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు.

పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో కలిసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు.. ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలేదో చెప్పాలని సీఎం, మంత్రులు అడిగారు. ఇప్పుడు ఫీజు పథకంపై సీఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతారు’’ అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.

‘‘వైఎస్‌కన్నా మేలైన విధంగా ఫీజుల పథకం అమలు చేస్తామన్నారు.. మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.31 వేలకు మించి చెల్లించబోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా మిగిలిన రూ.19 వేలు విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తారట. రైతులకు, కౌలుదారులకే అప్పులు ఇచ్చే దిక్కులేదు..’’ అని విమర్శించారు. ‘వైఎస్ చేపట్టిన ఫీజులు చెల్లింపు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల సమాజంలో 50 శాతం ఉన్న బీసీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. వీటిని నీరుగార్చడంతో నష్టపోయేది ఆ వర్గాలే’నని చెప్పారు.

సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అందుకు టీడీపీ సహకరిస్తోందని చెప్పారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. ఫీజుల పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చెప్పుకొంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆయన హయాంలో బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.300 ముష్టిగా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ఉదహరించారని తెలిపారు.

సోనియాను విజయమ్మ కలిసినట్లు నిరూపిస్తారా?
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. సోనియాగాంధీని కలిసినట్లు రుజువు చేస్తే పార్టీ ఎమ్మెల్యేలందరూ శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతామని, నిరూపించలేకపోతే చంద్రబాబు ఒక్కరు రాజకీయాల నుంచి తప్పుకుంటే చాలని శోభా నాగిరెడ్డి సవాలు విసిరారు. 

నేడు జిల్లాల్లో ధర్నాలు
ఫీజుల పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30కు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, రాజధానిలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నాలు చేపడుతున్నట్టు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!