YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 6 August 2012

ఫీజుల ఎత్తివేత కుట్రే!

వైఎస్ తర్వాతి ప్రభుత్వాల నిర్వాకం

హైదరాబాద్, న్యూస్‌లైన్: లక్షలాది పేదల కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నాలకు రెండేళ్ల కిందటే బీజాలు పడ్డాయి. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సాఫీగా సాగిన పథకాన్ని, ఆయన మరణానంతరం వ్యూహాత్మకంగా గాడి తప్పించే వ్యూహాన్ని రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు దశలవారీగా అమలుపర్చాయి. ఒకేసారి ఎత్తేస్తే ప్రజాగ్రహాన్ని, ఆందోళనను ఎదుర్కోవాల్సి వస్తుందనే భావనతో ‘పథకం అమలు పర్యవేక్షణ’ సాకుతో మంత్రివర్గ ఉపసంఘం వేసి పథకానికి అంచెలంచెలుగా కొర్రీలు వేస్తూ, ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. దాంతో ఉపసంఘం సమావేశం ఎప్పుడు జరిగినా ఎలాంటి ఆంక్షలు విధిస్తారో, ఎందరిని పథకం నుంచి తప్పిస్తారోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గాభరా పడేవారంటే అతిశయోక్తి కాదు! సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజు పరిమితి విధింపుతో మొదలైన ఆంక్షలు.. సుప్రీంకోర్టు తీర్పుతో తారస్థాయికి చేరాయి. వైఎస్ మృతి నాటికి రూ.500 కోట్లకు మించని ఫీజు పథకం బకాయిలను, ఆ తర్వాత రెండేళ్ల లోపే ఏకంగా రూ.3500 కోట్లకు చేర్చారు! తద్వారా ఈ పథకం ఖజానాకు భారమని చిత్రించజూశారు. బకాయిలను ప్రస్తుత ఏడాది బడ్జెట్ నుంచి చెల్లించే పరిస్థితి కల్పించారు. చివరికి ప్రస్తుత సంవత్సరానికి ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర రూపాయి కూడా లేదంటే.. బకాయిలను పద్ధతి ప్రకారం ఎలా పేర్చుకుంటూ వచ్చారో అర్థం చేసుకోవచ్చు!

రోశయ్య, కిరణ్ హయాంలో విధించిన ముఖ్య ఆంక్షలు..

సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులకు రీయింబర్స్‌మెంట్ గరిష్టంగా రూ.20 వేలే ఇస్తున్నారు (వైఎస్ హయాంలో పూర్తిగా ఇచ్చేవారు)

డిగ్రీ తర్వాత ఒక్క పీజీకే పథకం వర్తింపజేస్తున్నారు

వయోధికులు కూడా లబ్ధి పొందుతున్నారంటూ కోర్సులవారీగా వయో పరిమితి విధించారు

మైనార్టీ కాలేజీల్లో నాన్ మైనార్టీలు కన్వీనర్ కోటాలో చేరినా రీయింబర్స్‌మెంట్ రద్దు చేశారు

పారా మెడికల్ విభాగంలో 26 కోర్సులకు పథకం వర్తిస్తుండగా, 17కు కుదించారు. సర్టిఫికెట్ కోర్సులను కూడా ఎత్తేశారు

అసలు పీజీ కోర్సులన్నింటినీ పథకం నుంచి పూర్తిగా ఎత్తేసి డిగ్రీకే పరిమితం చేయాలని ప్రయత్నించారు. పత్రికలు ముందే పసిగట్టి వెలుగులోకి తేవడం, భారీగా విమర్శలు రావడంతో తాత్కాలికంగా వెనక్కు తగ్గారు

గేట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎంఫార్మసీల్లో చేరిన వారిని పథకం నుంచి మినహాయించారు. గతంలో రీయింబర్స్‌మెంట్ పొందిన వారి నుంచి సొమ్మును రికవర్ చేస్తున్నారు!

పీహెచ్‌డీ విద్యార్థుల్లో కొందరికి ఫెలోషిప్ వస్తుందన్న సాకుతో అందరికీ పథకాన్ని ఎత్తేశారు

అఫిడవిట్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్, 2012 మార్చి 31కల్లా ఆధార్ కార్డుంటేనే రీయింబర్స్‌మెంట్‌కు అర్హులని ప్రకటించారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!