YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 10 September 2012

ఆ చర్చల ఆంతర్యం ఏమిటి?

ప్రధానితో చంద్రబాబు ఒక్కరే ఎందుకు భేటీ అయ్యారు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మన్మోహన్‌తో ఏకాంతంగా జరిపిన చర్చల ఆంతర్యం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ‘పార్టీల నేతలెవరైనా ప్రధానిని కలవొచ్చు, కాంగ్రెస్ నేతలు కలిస్తే ఎవరూ ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేదు. కానీ కాంగ్రెస్‌తో వైరం ఉందని చెప్పుకునే బాబు ప్రధానితో ఏకాంతంగా భేటీ కావడమే అనుమానాలు కలిగిస్తోంది. బీసీ డిక్లరేషన్ వినతిపత్రం ఇచ్చే నెపంతో ప్రధానిని కలిసి, వెంట ఉన్న వారందరినీ కనుసైగలతో బయటకు పంపి తానొక్కరే 5 నిమిషాల సేపు మన్మోహన్‌తో చర్చించిన రహస్యాలేమిటి?’ అని నిలదీశారు. ఇలాంటి వార్త ఒక మీడియాలోనే వచ్చిందని టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్పడం తగదన్నారు. 

ఇలాంటి వార్తలు పత్రికల్లో వచ్చినప్పుడు అవి నిజమైతే హుందాగా స్వీకరించడమో లేదా వివరణ ఇవ్వడమో చేయాల్సింది పోయి.. టీడీపీ వక్రీకరించే యత్నం చేస్తోందని విమర్శించారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రధానిని కలిసి బయటకు వచ్చాక.. బొగ్గు కుంభకోణంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు రావని మీడియాకు భరోసాగా చెప్పడాన్ని బట్టి ఆయన లోపల ఏమి మాట్లాడి ఉంటారనే సందేహం వ్యక్తమవుతోందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు.. సమాచారహక్కు కమిషనర్ల నియామకంలోనూ, ఇటీవలి ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌తో కుమ్మక్కైన చంద్రబాబుకు ఎంతసేపూ జగన్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేదన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నది టీడీపీయేననీ, ప్రజాబలం ఉన్న వారికి బాబులాగా మీడియాను అడ్డం పెట్టుకోవాల్సిన పనిలేదని పద్మ స్పష్టం చేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!